సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సంపూర్ణగా స్వాగతిస్తున్నామని సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పలువురు ప్రొఫెసర్లు తెలిపారు. వచ్చే వందేండ్లను దృష్టిలో పెట్టుకుని నగరంలో మెట్రో రైలు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ సివిల్ విభాగం ప్రొఫెసర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. మెట్రో విస్తరణపై ‘నమస్తే తెలంగాణ’ తో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు…
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు చాలా అద్భుతం. నగరంలో రోడ్డు రవాణా రంగం కంటే మెట్రో రైలు మార్గమే ప్రయాణికులకు ఎంతో సులభంగా ఉంటుంది. సకాలంలో ప్రయాణం చేస్తున్నారు. ఉమ్మడి కాలంలో అప్పటి ప్రభుత్వాలు అనాటి జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేయలేదు. దీంతో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో నగరంలో వర్షం వల్ల, యాక్సిడెంట్లతో పాటు ఇతరత్రా కారణాల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ నగర ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే మెట్రో రైలును నగరం నలుమూలలా విస్తరింపజేయాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం.
మెట్రో రైలు వంటి ట్రాన్స్పోర్టు విస్తరణ ప్రభావం వల్ల హైదరాబాద్ సామాజికంగా, ఆర్థిక ప్రగతి సాధించడానికి ఎంతో శుభసూచికంగా మారుతుంది. మెట్రో రైలు వల్ల నగరంలో సొంత వాహనాల తాకిడి బాగా తగ్గుతుంది. సురక్షితమైన ప్రయాణం కోసం ప్రజలు మెట్రోను తప్పకుండా ఆశ్రయిస్తారు. ఫలితంగా నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. వాహనాల వల్ల వచ్చే వాయుకాలుష్యం బాగా తగ్గుతుంది. నగరం గ్రీన్ సిటీగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారాలు, అత్యవసర సర్వీసులు, ఇతర అవసరాల కోసం ఉపయోగించే రోడ్డు మార్గంలో వాహన దారులకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. మెట్రో రైలు కేవలం ఆస్తుల కోణంలో చూడకుండా.. నగర ప్రయాణికుల భద్రత, కమ్యూనికేషన్ కల్పించడానికి అవకాశం ఉంది. సర్కారు నిర్ణయం వల్ల నగర రవాణా రంగాభివృద్ధి పూర్తి స్థాయిలో బలపడుతుంది. మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ వల్ల భవిష్యత్తులో మహిళలకు ఎంతో భద్రతగా ఉంటుంది.
మెట్రో రైలు వంటి రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల నగరం పరిధి పెరుగుతుంది. సదుపాయాలు పెరుగుతాయి. రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో వ్యాపారాలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్టు విస్తరణ వల్ల నగరం చుట్టుపక్కలా అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉంటుంది. ఫలితంగా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. ఈ విధంగా అనేక రంగాలు కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది.