Psychology | కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రవళికి ప్రతిదీ అనుమానమే. ఇంట్లో కదలికలు బయటి వారు చూస్తున్నారని నిత్యం ఆందోళన చెందుతూ, ఇంట్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టారని ఊహించుకునే వరకు వెళ్లింది. ప్రతీ రోజు ఆమె రాత్రి పూట స్నానం చేసేది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెతో కలిసి మానసిక నిపుణులను ఆశ్రయించాడు. ఆమె ఓసీడీతో బాధపడుతుంది.
బీటెక్ పూర్తి చేసిన ప్రకాశ్ అమ్మాయి ప్రేమ నిరాకరించిందని ఇంట్లోనే ముభావంగా ఉంటున్నాడు. ఎంత చెప్పినా అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉద్యోగం చేయకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. అతడిని సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లగా కౌన్సె లింగ్లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘నేను చెడిపోయాను. నాకు అన్నీ పాడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుళ్లపై కూడా నేను పాడు ఆలోచనలు చేస్తున్నాను. నేను బతకడానికి వీల్లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.’ అంటూ లేఖ రాసి బిల్డింగ్ మీద నుంచి దూకడానికి ప్రయత్నించిన అరుణ అనే వివాహితను ఆమె అన్నయ్య రక్షించి సైకాలజిస్టును సంప్రదించాడు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 ( నమస్తే తెలంగాణ ) : మానసిక సమస్యలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటంత భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారితీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి. వీరేందర్ చెప్పారు. యూ అండ్ మీ సంస్థ ఏర్పాటు చేసి వేలాది మంది మానసిక సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతున్నారు. ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం బాగుంటే అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి తగ్గుతుందని వివరించారు. రాష్ట్ర స్థాయిలో మెంటల్ హెల్త్ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మెంటల్ హెల్త్పై నగరంలో పలు ప్రాంతాలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తూ మానసిక సమస్యలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.
నాలుగు ప్రధాన సమస్యలతో..
నగరవాసులు నాలుగు ప్రధానమైన మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అవి ఓసీడీ, ఒత్తిడి, ఆందోళన, సైకోసిస్. ఈ కారణాలతో వారు జబ్బులకు గురవుతున్నారు. 70 శాతం రోగాల వెనక మానసిక సమస్యలే కారణం. కానీ ఈవిషయంపై అవగాహన లేక చాలా మంది మానసిక సమస్యలు ముదిరే వరకు నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా వారు ఇతర అనారోగ్యాలకు గురవుతుంటారు. ఈ క్రమంలో వారు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు.
తల్లిదండ్రులు మేల్కోవాలి
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులదే. మొదటి ఆరేండ్లు పేరేంట్స్ పిల్లలతో సక్రమంగా లేకపోతే అది చాలా వ్యతిరేక పరిస్థితులకు దారితీస్తాయి. చిన్నారుల మానసిక ఎదుగదలలో పేరేంట్స్దే కీలక పాత్ర. తల్లిదండ్రులు పిల్లల ముందరే ఘర్షణలు, పోట్లాడుకోవడంతో వినాశకర పరిస్థితుల ప్రభావం పిల్లలపై పడుతుంది. మానసికంగా కుమిలిపోయి వారి ఎదుగుదల అంతా వ్యతిరేకంగా( యాంటి సొసైటీ పర్సనాలిటీ డిసార్డర్) సాగుతుంది. క్రిమినల్స్ అందరూ ఇంట్లోనే తయారు చేయబడుతారనే విషయం పేరేంట్స్ గుర్తుంచుకోవాలి.
ఓసీడీ (ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్)
ఇదొక అనుమాన జబ్బు. చేసిన పనినే మళ్లీమళ్లీ చేయాలనుకుంటారు. ఒకే ఆలోచనను పట్టుకుని వేలాడుతుంటారు. రెండోది ఒత్తిడి. ఇది చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి వారిని ఏ పని చేయకుండా వెనక్కి లాగుతుంటుంది. మూడోది ఆందోళన. కుదురుగా ఉండనివ్వదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చివరిది సైకోసిస్. ఇది విచిత్రమైనది. ఏమీ లేకున్నా ఏదో కనిపిస్తుందనే భ్రమ పడుతుంటారు. పక్కవారు ఏమీ మాట్లాడుకున్నా తన గురించే మాట్లాడుతున్నాడు అని నిర్ణయానికి వచ్చేస్తారు. అనుమానంతో రగిలిపోతుంటారు. చాలా వరకు కాపురాలు సైకోసిస్ సమస్యలతో కూలిపోయాయి.
కౌన్సెలింగ్ పనిచేస్తుందా?
మాత్రలేమీ ఉండవు. మాటలతోనే బాధితుడి ఆలోచనలను మార్చడం (రీస్ట్రక్చర్ ఆఫ్ థాట్స్) సాధ్యమేనా ? మనిషి అంటేనే ఆలోచన. ఆలోచన నుంచే అనుభూతి చెంది.. ఆ ప్రకారంగానే ప్రవర్తన ఉంటుంది. అదే ఆ వ్యక్తి జీవనయానం. కనుక ఆలోచనలకు కౌన్సెలింగ్ అవసరం.
యూ అండ్ మీ గురించి?
యూ అండ్ మీ సంస్థ 2006లో ప్రారంభించాం. బాగ్లింగంపల్లిలో ప్రధాన కార్యాలయం ఉంది. ఇప్పటి వరకు 20 వేల మందికి పరిష్కారాలు చూపెట్టాం.15వేల మంది విద్యార్థులకు మానసిక సమస్యలపై అవగాహన కల్పించాం. 25 వేల మందికి మెంటల్ హెల్త్ మెటీరియల్స్ ఉచితంగా పంపిణీ చేశాం. విదేశాల నుంచి కూడా ఆన్లైన్లో కౌన్సెలింగ్ తీసుకుంటారు. తైవాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్ తదితర దేశాల్లోనూ కౌన్సెలింగ్ సెషన్స్ ఏర్పాటు చేశాం. అక్కడి వారు ఎక్కువగా ఓసీడీ, డిప్రెషన్తో బాధపడుతుంటారు. ఇదిలా ఉండగా నగరంలో ఇప్పుడు ఎగ్జిబిషన్లలో అన్ని రకాల చార్ట్లు ఏర్పాటు చేసి మానసిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకున్నాం. ఈనెల 30న దుర్గం చెరువు పార్క్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం.