సుల్తాన్బజార్, నవంబర్ 25: స్త్రీలకు కుటుంబ నియంత్రణ భారాన్ని వేయకుండా ఎటువంటి కోత, కుట్టు లేని నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్సకు మగవారు ముందుకు రావాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి సూచించారు. కింగ్ కోఠి క్లస్టర్ సుల్తాన్బజార్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో నో స్కాల్పెల్ వేసెక్టమీ(ఎన్ఎస్వీ)శస్త్ర చికిత్సపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్పీహెచ్వో, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పద్మ జతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరిద్దరు పిల్లలు జన్మించిన అనంతరం సంతానం వద్దనుకునే సమయంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు.
స్త్రీలు ఒకటి,రెండు సార్లు ప్రసవ వేదన అనుభించి ఉంటారని వారిపై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ భారాన్ని మోపడం సరైంది కాదన్నారు. కోత, కుట్టులేని నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్స కేవలం ఐదు నిమిషాల్లో పూర్తవుతుందన్నా రు. ఈ ఆపరేషన్ పూర్తయిన అనంతరం తమ అన్ని పనులను యథావిధిగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్స చేయించుకొని రూ. 1100 పారితోషికాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుల్తాన్బజార్ యూపీహెచ్సీ పీహెచ్ఎన్ రామలక్ష్మితో పాటు వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.