తెలుగు యూనివర్సిటీ, జూన్ 22: అమరవీరుల ఆశయాలను సాధించేవరకు విశ్రమించమని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద పలువురు నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులను స్మరిస్తూ ఉద్యమ గీతాలను ఆలపించి నాటి రోజులను, వారి త్యాగాలను కళాకారులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా అమరుల స్మారక దీపం వరకు కవిత తరలివెళ్ళారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్, గోషామహల్ నియోజకవర్గం ఇన్చార్జి నందకిషోర్ వ్యాస్, పరమేశ్వరి సింగ్, మమతా గుప్తా, ఆర్వీ మహేందర్, గడ్డం శ్రీనివాస్, ఆల పురుషోత్తం, రాంచందర్, మారుతీ సాగర్, యోగి తదితరులు పాల్గొన్నారు.
అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్ జక్క వెంకట్రెడి, జాయింట్ కలెక్టర్ ఏ.నరసింహారెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం, అమర వీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం, మేడిపల్లి అమర వీరుల స్మారక స్తూపం నుంచి భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. – పీర్జాదిగూడ, జూన్ 22
రాష్ట్ర సాధనలో అమరులైన వీరులకు చిహ్నంగా నిర్మించిన స్తూపం ప్రారంభోత్సవానికి మలక్పేట, యాకుత్ఫురా నియోజక వర్గాల నుంచి గురువారం పెద్ద పెట్టున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, యాకుత్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు మైల్కోల్ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. – సైదాబాద్, జూన్
అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభం సందర్భంగా సికింద్రాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ, బీఆర్ఎస్ నేతలు రామేశ్వర్ గౌడ్, కిరణ్ గౌడ్, కరాటే రాజు, జలంధర్ రెడ్డి, రాజు సుందర్ పాల్గొన్నారు. – అడ్డగుట్ట, జూన్ 22
దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం అసెంబ్లీ ప్రాంగణం వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ కమిషన్ మెంబర్ కె.కిషోర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్రనాయక్లు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. – రవీంద్రభారతి, జూన్ 22
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల ముగింపులో భాగంగా టీఎస్టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో కూకట్పల్లి నుంచి తెలంగాణ అమరుల స్మారక కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు మూడు వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాధా రంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి, ఉపాధ్యక్షులు గోళ్ల సుభాష్ చంద్రబోస్, కేశవ దేవరాయ్, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కోనా దాక్షాయిని తదితరులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ)