కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15 : జేఎన్టీయూలో శనివారం నిర్వహించనున్న మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి కోరారు. జేఎన్టీయూహెచ్ వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మెగా జాబ్మేళాలో 100 ప్రముఖ కంపెనీలు హాజరవుతాయని.. 10వేల ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వీసీ తెలిపారు.
10వ తరగతి, ఇంటర్, డిప్లమా, ఐఐటీ, బీటెక్, ఎంటెక్, ఆల్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ 2016 నుంచి 2023 వరకు ఉత్తీర్ణులైన వారంతా అర్హులు. ఐటీ, ఐటీఈఎస్, మేనేజ్మెంట్, ఫార్మా, కోర్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాను వర్సిటీతో పాటు అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని యూఐఐసీ డైరెక్టర్ తారాకల్యాణి, డిప్యూటీ డైరెక్టర్ సురేశ్కుమార్ కోరారు.