వెస్ట్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా
టీఎంఐ-జాబ్కనెక్ట్ను ప్రారంభించిన సీపీ సీవీ ఆనంద్
యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో ఉద్యోగాల జాతర
జూబ్లీహిల్స్, మార్చి26 : యువతను సన్మార్గంలో నడపడమే లక్ష్యంగా నగరంలో విస్తృతంగా జాబ్ కనెక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం యూసుఫ్గూడ కోట్ల విజయ భాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో వెస్ట్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాజాబ్ మేళాను డీసీపీ జోయల్ డేవిస్, టీఎంఐ సీఈవో రవి రామకృష్ణన్తో కలిసి సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు టీఎంఐ సౌజన్యంతో 70 కంపెనీలలో 3000కు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామని చెప్పారు. టీఎంఐ-జాబ్కనెక్ట్కు మరో 2 వాహనాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసు శాఖలోని ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా స్టాల్స్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి తొలి ఉద్యోగాలు సొంతం చేసుకున్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగమొచ్చింది..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నుంచి ఉద్యోగం కోసం జాబ్మేళాకు వచ్చాను. ఇంటర్తో పాటు కంప్యూటర్ హార్డ్వేర్ పూర్తిచేశాను. యాక్ట్ ఫైబర్నెట్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఇంటర్వూలో మొదటి ఉద్యోగం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. – భరత్రాజ్, జడ్చర్ల, తొలి ఉద్యోగ అభ్యర్థి
18 వేల ఉద్యోగాలు కల్పించాం
నాలుగేండ్లలో 43 జాబ్ ఫెయిర్లు నిర్వహించి 18 వేల ఉద్యోగాలు కల్పించాము. ఇప్పటివరకు 1 లక్ష 40 వేలకు పైగా నిరుద్యోగులు టీఎంఐలో నమోదు చేసుకున్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. – రవి రామకృష్ణన్, టీఎంఐ సీఈవో
గౌరవంగా బతుకుతాం..
పోలీసుల జాబ్ కనెక్ట్తో ఏర్పాటు చేస్తున్న జాబ్మేళాలు ట్రాన్స్జెండర్లకు అండగా ఉంటున్నాయి. సమాజంలో గౌరవం పొందేందుకు మాకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది. మేమూ సమాజంలో మమేమకమయ్యేందుకు మరిన్ని జాబ్మేళాలు నిర్వహించాలి.
– మధుశాలిని, ట్రాన్స్జెండర్, కౌకూర్