మేడ్చల్, నవంబర్29(నమస్తే తెలంగాణ): ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులు, రైతులు మినీ డెయిరీ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం 5 వందల యూనిట్లు మంజూరు చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఎస్సీ రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు జిల్లాలో మినీ డైయిరీలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం ఎస్సీ రైతులను ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో మినీ డెయిరీ ఏర్పాటు చేసుకునేందుకు 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే మరిన్ని మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన రైతులకు మంజూరు ఇవ్వనున్నారు.
మినీ డెయిరీల ఏర్పాటుకు అర్హత ఉన్న ఎస్సీ రైతులకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. మినీ డెయిరీ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుడికి,లేదా ఇంటి కుటుంబ సభ్యులపై కనీసం 10 గుంటల భూమి ఉండి పాస్బుక్ ఉండాలి. ప్రభుత్వ భూమైనా, పట్టాభూమి ఉన్న ఈ పథకానికి అర్హుడే. మినీ డెయిరీ యూనిట్ ఏర్పాటుకు రూ. 2 లక్షలు కాగా ఇందులో 70 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రూ. 2 లక్షలలో లక్షా40 వేలు ప్రభుత్వం అందిస్తుండగా… రూ. 60 వేలను బ్యాంకు నుంచి లబ్ధిదారుడికి రుణాల ద్వారా అందిస్తారు. యూనిట్కు రెండు గేదెలు లేదా రెండు ఆవులను తీసుకోవచ్చు. ప్రతి రోజు సుమారు 8 నుంచి 10 లీటర్ల పాలను ఇచ్చే గేదెలు, ఆవుల రకాలు ఉంటాయి.
పాలను మార్కెట్లో సులువుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. మినీ డెయిరీల ద్వారా వచ్చిన పాలను విజయ డెయిరీతో విక్రయాలు చేయిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ తెలిపారు. ప్రస్తుతం 5 వందల యూనిట్లు మంజూరైనప్పటికీ అదనంగా దరఖాస్తులు వచ్చిన యూనిట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. విజయ డెయిరీ కాకుండా పాలను ఎక్కడైన విక్రయించుకొనే అవకాశం ఉన్నదని, జిల్లా వ్యాప్తంగా మినీ డెయిరీల యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వర్తింపజేయనున్నారు. పాలకు లీటర్ ధర రూ. 80 నుంచి వంద రూపాయలు ఉండి, పాల ఉత్పత్తులకు నగరంలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో సబ్సిడీ ఇచ్చి ఎస్సీ రైతులను ప్రోత్సహించేలా జిల్లాలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.