కొండాపూర్, ఫిబ్రవరి 6: ఇన్ఫెక్షన్కు గురై కోల్పోయిన పురుషాంగాన్ని వైద్యులు పునర్నిమించి యధావిధిగా అమర్చిన హైటెక్ సిటీ మెడికవర్ దవాఖాన వైద్యులు యువకునికి కొత్త జీవితాన్ని అందించారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రవి కుమార్ వెల్లడించారు. సొమాలియాకు చెందిన యువకుడి(19)కి నాలుగేండ్లున్నప్పుడు సున్తీ చేశారు. కాగా, సున్తీ సమయంలో ఇన్ఫెక్షన్తో అతని పురుషాంగం పూర్తిగా కోల్పోయాడు. మూత్ర విసర్జన సైతం కూర్చొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎన్నో ఏండ్లుగా అనేక మంది వైద్యులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. తమ సమస్యతో మెడికవర్ దవాఖానకు వచ్చిన సదరు యువకుడికి యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించి, యువకుడికి పురుషాంగంతో పాటు వృషణాలను పునః సృష్టించేందుకు చికిత్సను ప్రారంభించారు. యువకుడి మంజేయికి మైక్రో వాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్జెరీ ఫోర్ ఆర్మ్ ప్లాప్ నుంచి పురుషాంగాన్ని పునః సృష్టించారు.
10 గంటలకు పైగా శ్రమించిన వైద్య బృందం యువకుడి పురుషాంగాన్ని యధావిధిగా అమర్చారు. ప్రస్తుతం, యువకుడు పూర్తిగా కోలుకుని సాధారణ పురుషుల మాదిరిగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. గత సంవత్సరం శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందం వారం రోజుల క్రితం యువకుడి పురుషాంగంలో పినైల్ ఇంప్లాంట్ను విజయవంతంగా అమర్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో వివాహం చేసుకుని సంసారం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.