పీర్జాదిగూడ, డిసెంబర్ 6 : ఎవరూ అధైర్యపడవద్దని వైద్య పరమైన సహాయం అందిస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నారెడ్డి నగర్లో నివసిస్తున్న వెంకటయ్య, శకుంతల దంపతుల ముగ్గురు బిడ్డలు ‘మస్క్యూలర్ డిస్ట్రోఫీ’ అనే జనెటికల్ సమస్యతో బాధపడుతున్నారు. వారి సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి మేయర్ గద్వాల విజయలక్ష్మి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఐదుగురు వైద్యుల బృందం బాధితుల ఇంటికి చేరుకొని పరీక్షలు నిర్వహించారు.ముగ్గురు అమ్మాయిలు తీసుకుంటున్న చికిత్స వివరాలు, వ్యాధి లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం. సుజాత, శ్రీనాధ్, డాక్టర్ సునీత, డాక్టర్ శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.