బొల్లారం : ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. గురువారం కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లకు సెల్ఫోన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తున్నది అన్నారు.
విధుల్లో భాగంగా ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. నిరుపేదలకు వైద్య సేవలను చేరవేసేందుకు రూ.కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ తరహాలో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాలలో ఉచితంగా సుమారు 56 రకాల వైద్య పరీక్షలు, మందులు అందజేస్తారని వివరించారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్, వైద్య సిబ్బంది శ్రీలక్ష్మి, మహిళ అధ్యక్షురాలు సరిత, మాజీ డైరెక్టర్ వినీత, వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ తదితరులు పాల్గొన్నారు.