సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఒకపక్క వేడుకలు, పండుగలు.. మరోపక్క వాయువేగంతో దూసుకొస్తున్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్లు.. ఏ మాత్రం ఆదమరిచినా ఆగమే అంటున్నారు వైద్యనిపుణులు. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో నిర్వహించే నూతన సంవత్సర వేడుకలు, మరో పదిహేను రోజుల తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ, గణతంత్య్ర దినోత్సవ వేడుకల సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే వేడుకలు, ఆలయ దర్శనాలు, పర్యాటక ప్రయాణాలు వంటి సమయాల్లో కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలని, సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత వరకు అటూ, ఇటూ ప్రయాణాలు చేయకపోవడం క్షేమమంటున్నారు.
థర్డ్వేవ్ సంకేతాలు..
ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం థర్డ్వేవ్ వస్తున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరకు కేవలం విదేశాలు, రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లకు సైతం వ్యాపిస్తుందని, ఫలితంగా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. విదేశాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక తదితర ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో థర్డ్వేవ్ సంకేతాలు కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని వైరస్పై నిర్లక్ష్యం వహించవద్దంటున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వాయు వేగంతో వ్యాపిస్తుందని, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా అంత తీవ్రంగా లేనందున ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు. జాగ్రతలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో తస్మాత్ జాగ్రత్త.!
వేడుకలు, పండుగలు, శుభకార్యాలు, విందులు, వినోదాలు వంటి సామూహిక కార్యక్రమాలు, మార్కెట్లు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు లాంటి ప్రదేశాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం మరిచిపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుని, ఫలితాలు వెలువడే వరకు ఐసొలేషన్లో ఉండటం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.