సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కరోనా… దాదాపు అందరూ ఈ పేరును ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా 2022 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అన్ని రకాల వ్యవస్థలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో యూకే తదితర దేశాల్లో కొత్త వేరియంట్ కలకలం స్పష్టిస్తున్నది. ఒమిక్రాన్ జాతికి చెందిన ఎరిస్ వేరియంట్ టెన్షన్ పెడుతున్నది. ఆయా దేశాల్లో వందలు, వేల సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ మన దేశంలో మాత్రం తీవ్రత పెద్దగా కనిపించడం లేదు.
ఫిబ్రవరి 17న తొలిసారిగా ఎరిస్(ఈజీ 5.1)ను గుర్తించగా, మన దేశంలో మొట్టమొదటి కేసు మే 22న మహారాష్ట్రలో బయట పడింది. ఒమిక్రాన్ జాతికి చెందిన ఈ వేరియంట్తో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేస్తున్నారు వైద్యనిపుణులు.
ఒమిక్రాన్ ఉపవేరియంటైన ఎక్స్బీబీ.1.9.2, ఎక్స్బీ.బీ.1.5ల కలయికతో ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ ఏర్పడింది. దీనినే ఎరిస్ వేరియంట్గా పిలుస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాడాల తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వేరియంట్ తీవ్రత పెద్దగా లేదని, వ్యాప్తి చెందే స్వభావం మధ్యస్తంగా ఉన్నట్లు చెప్పారు. అయితే వ్యాక్సినేషన్ నుంచి తప్పించుకునే స్వభావం కూడా మధ్యస్తంగానే ఉందన్నారు. అన్ని వేరియంట్లు అన్నిచోట్ల ఒకే రకమైన ప్రభావం చూపవని, ఆయా ప్రాంతాల వాతావరణ, జీవన విధానం తదితర పరిస్థితుల ఆధారంగా వేర్వేరుగా వైరస్ల ప్రభావం ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ వేరియంట్ విదేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపినా.. మన దేశంలో పెద్దగా ప్రభావం చూపలేదన్నారు.
ఒమిక్రాన్ జాతికి చెందిన దాదాపు వేరియంట్లు అన్ని మన వద్ద పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేకపోయినా.. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న దృష్ట్యా గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ ఎరిస్తో ముప్పు లేనప్పటికీ తెలంగాణలో ఎలాంటి పరస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, గ్రేటర్లోని ప్రతి దవాఖానలో ఇప్పటికిప్పుడు కరోనా కేసులు నమోదైనా చికిత్స అందించే పూర్తిస్థాయి వ్యవస్థ సిద్ధంగా ఉన్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు.