మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 27: ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయని, ఈ పరీక్షల నిర్వహణలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా 133 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అందులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో జనరల్ 62342 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1452 మంది మొత్తం 63794 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్లో 54146 మంది, ఒకేషనల్ కోర్సులో 995 మంది విద్యార్థులు మొత్తం 55141 మంది పరీక్షలు రాస్తారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, డీఈవో విజయకుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.