హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డాక్టర్ ముసుగులో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వైద్యుడిని వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ నుంచి లక్షల రూపాయాల విలువ చేసే ఎండీఎంఏ, కెటమైన్ అనే డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధా కిషన్రావు కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 నార్త్ పరగణ జిల్లాకు చెందిన మహ్మద్ షబ్బీర్ అలీ కోల్కతా యూనివర్శీటీలో ఆయుర్వేద కోర్సు పూర్తి చేశాడు. జీవనోపాధి కోసం 2009లో హైదరాబాద్కు వచ్చాడు. గౌలిగూడలోని దిలీప్ కుమార్ అనే డాక్టర్ వద్ద మూడు నెలల పాటు పని చేశాడు. ఆ తర్వాత చాంద్రాయణగుట్టలో ఫర్ఫెక్ట్ డెంటల్ అండ్ పైల్స్ క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఇక సంపాదన అనుకున్న దాని కంటే అధికంగా రావడంతో.. విలాసవంతమైన జీవితానికి అలవాడు పడ్డాడు షబ్బీర్. భార్య, ముగ్గురు పిల్లలు ఉండటంతో ఆ సంపాదన సరిపోలేదు.
దీంతో డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా చెన్నైకి చెందిన శివ అనే వ్యక్తి షబ్బీర్కు పరిచయం అయ్యాడు. అతనికి రూ. 30 వేలు బదిలీ చేసి, బ్లూ డాట్ కొరియర్ ద్వారా 53 గ్రాముల ఎండీఎంఏ తెప్పించుకున్నాడు. అయితే ఎండీఎంఏను విక్రయించేందుకు షబ్బీర్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ కస్టమర్లు దొరకలేదు. ఇటీవలే ఒడిశాలోని మల్కన్గిరికి వెళ్లి.. రూ. 12 లక్షలకు 850 గ్రాముల కెటమైన్ను కొనుగోలు చేశాడు. అయితే చాంద్రాయణగుట్టలోని క్లినిక్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. 53 గ్రాముల ఎండీఎంఏ, 850 గ్రాముల కెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 12.32 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.