సిటీబ్యూరో, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న (గాంధీ) మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం గత నెలలోనే జరగాల్సి ఉండగా, నిరవధికంగా కురిసిన వానలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ నెల 20న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభు త్వం గ్రేటర్లో 3 మదర్ అండ్ చైల్డ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ (ఎంసీహెచ్) నిర్మాణానికి శ్రీకారం చుట్టిం ది. ఇందులో ఒకటి నిమ్స్లో, రెండోది అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్ పరిధిలోది. కాగా మూడోది గాంధీ. ప్రస్తుతం గాంధీలో నిర్మించిన ఎంసీహెచ్ హాస్పిటల్ ఈ నెల 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూడు సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్లో మాతా, శిశువులకు అన్ని రకాల మల్టీపుల్ వైద్య సేవలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి. ప్రసవం సమయంలో, తరువాత మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో పాటు పుట్టిన శిశువు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవలు ఈ ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో రోగులకు అందనున్నాయి.
గర్భిణులకు డయాలసిస్ అవసరం పడితే అటూ ఇటూ తిప్పకుండా ఉన్నచోటనే డయాలసిస్ అందించేందుకు ఎంసీహెచ్ హాస్పిటల్లోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతే కాకుండా పెద్దవారి కోసం 22 వెంటిలేటర్లు, శిశువుల కోసం 24 వెంటిలేటర్లు, వామర్లు, గుండె పరీక్షల కోసం 2డి-ఎకో యంత్రాలు, ప్రసవాలు, ఇతర స్త్రీ సంబంధిత చికిత్స కోసం లేబర్ రూమ్కు కొల్పోస్కోపి, ల్యాపరోస్కోపి తదితర యంత్రాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మదర్ అండ్ చైల్డ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గర్భిణులు, ప్రసవించిన బాలింతలతో పాటు పుట్టిని బిడ్డలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల కోసం ప్రభుత్వం తొలుత రూ.5 కోట్లు మంజూరు చేసింది. అవి సరిపోకపోవడంతో అదనంగా మరో రూ.3 కోట్లను మంజూరు చేయడంతో మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో ఆధునిక వెంటిలేటర్లు, డయాలసిస్ యంత్రాలు, 2డి-ఎకో, వామర్లు, కోల్పోస్కోపి, ల్యాపరోస్కోపి తదితర వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు.
గాంధీ దవాఖానలో రూ.52 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్ధ్యం గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తైంది. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ఈ దవాఖానలో ప్రసవించిన మహిళలు, శిశువులకు సంబంధించిన అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రధానంగా గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ ‘మదర్ అండ్ చైల్డ్ కేర్’ సెంటర్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించనున్నారు.
ప్రస్తుతం గాంధీ దవాఖానలో 300 పడకల సామర్ధ్యంతో ప్రసూతి విభాగం అందుబాటులో ఉంది. ఇందులో 200 పడకలు గర్భిణులు, స్త్రీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించగా, మరో 100 పడకలు చిన్నపిల్లల కోసం ఉన్నాయి. అయితే, గాంధీ దవాఖానకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోగుల తాకిడి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న 200 పడకల సామర్ధ్యం గల ఎంసీహెచ్ సూపర్స్పెషాల్టీ హాస్పిటల్తో మాతా, శిశువులకు మరింత మెరుగైన వైద్యం అందనుంది. ప్రస్తుతం దవాఖానలో మాతా, శిశువుల కోసం ఉన్న 300 పడకలకు తోడు 200 పడకలు అదనంగా చేరాయి.
గాంధీలో సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మెడకిల్ ఎక్విప్మెంట్స్ కూడా 75 నుంచి 80 శాతం వరకు ఇన్స్టాల్లేషన్ చేయడం పూర్తైంది. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో మదర్ అండ్ చైల్డ్కు సంబంధించిన అన్ని రకాల సూపర్ స్పెషాల్టీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్లినికల్ వర్క్స్ దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఈ నెల 20న మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే మాతా శిశు మరణాల రేటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన