రవీంద్రభారతి, ఆగస్టు 21 : అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీ) సంచార కుల, జాతులకు ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఆర్థిక చేయూత, ప్రవేశ పరీక్షలతో నిమిత్తం లేకుండా ఫూలే పాఠశాలల్లో ప్రవేశాలు, పలు ప్రత్యేక సంక్షేమ పథకాలతో జీవన భరోసా, భద్రతను నింపిన సీఎం కేసీఆర్కు ఈ వర్గాలు రుణపడి ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం వీరభద్రీయ వీరముష్ఠి సంఘం 50 ఏండ్ల స్వర్ణోత్సవాలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా కాటేపల్లి వీరాస్వామి సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కృష్ణమోహన్ రావు, ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్యే ముఠాగోపాల్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ… మీరముష్ఠి వారంటే అడుక్కునే వాళ్లు కాదని, ముష్ఠి అంటే పిడికిలి అని, ధీరత్వానికి ప్రతీక అని తెలిపారు. సంచార కులాలు తమ సాంస్కృతిక కళా రూపాలతో సమాజానికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. అనంతరం పలు డిమాండ్లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ వీరభద్రీయ (వీరముష్ఠి) సంఘం అధ్యక్షుడు కాటపల్లి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు కొండయ్య, కల్యాణి క్రాంతికుమార్, కార్యదర్శి శివరాజ్, కోశాధికారి గండిస్వామి, వీరభద్రీయ వీరముష్ఠి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ విజయచందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కార్యదర్శి ఎల్లేశ్, కోశాధికారి శ్రీశైలం, వీరభద్రీయ వీరముష్ఠి విద్యా కమిటీ చైర్మన్ విఠల్ పాల్గొన్నారు.