Ronald Ross | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతున్నది. ముఖ్యంగా మేయర్, కార్పొరేటర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా అంతా తానై అన్నట్లు నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.. నిబంధనల ప్రకారం కాలానుగుణంగా చేపట్టాల్సిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలను సైతం నిర్వహించకుండా… చివరకు బల్దియా బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సైతం చర్యలు తీసుకోలేదు. కార్పొరేటర్ల ఒత్తిడితో మేయర్ లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలంటూ.. కారణం చూపి వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మేయర్ విజయలక్ష్మి నేరుగా సీఎం రేవంత్రెడ్డిని కలిసి విషయం చెప్పడంతో కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టినట్లయింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కొంతకాలంగా ప్రజాప్రతినిధులను విస్మరిస్తూ పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లుగా భారీ ఎత్తున విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి గ్రేటర్ గత స్టాండింగ్ కమిటీ గడువు గతేడాది అక్టోబరులోనే ముగిసింది. దీంతో కమిషనర్ నవంబరులో నోటిఫికేషన్ జారీ ఎన్నిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఎన్నికల తర్వాత గత ఏడాది డిసెంబర్ 3న ఎన్నికల్ కోడ్ ముగిసింది.
కానీ ఇప్పటివరకు అంటే దాదాపు రెండు నెలల పాటు ఆ ప్రక్రియనే చేపట్టలేదు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో నగరాభివృద్ధికి సంబంధించిన అనేక పనులు, నిర్ణయాలు పెండింగ్లో పడ్డాయి. కాగా, స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కార్పొరేటర్ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిబంధనల ప్రకారం బల్దియా బడ్జెట్ను తొలుత స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తర్వాత కౌన్సిల్ మీటింగ్లో ప్రవేశపెట్టి ఆమోదం అనంతరం ప్రభుత్వ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బల్దియా బడ్జెట్ను నేరుగా ప్రభుత్వానికి పంపి ఆమోదింపజేసుకునేందుకు కమిషనర్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదంటూ కమిషనర్ వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి అసలు విషయాన్ని బయటపెట్టినట్లు తెలిసింది. మీరే అపమన్నందునే కమిషనర్ ఆపుతున్నారట’ అని మేయర్ కుండబద్దలు కొట్టడంతో ముఖ్యమంత్రి బల్దియాలో సాధారణంగా జరగాల్సిన ప్రక్రియల్ని తానెందుకు ఆపమంటానని బదులిచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం తెలియడంతోనే సీఎం రేవంత్ నేరుగా కమిషనర్ రోనాల్డ్ రాస్తో ఫోన్లో మాట్లాడి.. ఆదివారం సమావేశానికి రావాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి, పేదలకు పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే హెచ్ఎండీఏ నుంచి రూ.100 కోట్ల నిధుల్ని బల్దియాకు ఇప్పించింది. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ నిధులను మౌలిక వసతుల కల్పనకు ఇవ్వకుండా కమిషనర్ మళ్లించారు.