Hyderabad | రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా మేరకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకుగానూ ముందస్తుగా 168 అత్యవసర బృందాలను రంగంలోకి దింపారు. దీంతో పాటు ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జి, ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు. వీరు వరద అంచనా బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేస్తారు. ఇప్పటికే అకస్మాత్తుగా కుండపోత వర్షానికి ఆయా చెరువులోకి భారీ వరద చేరినా నష్టం వాటిల్లకుండా చాలా చెరువుల్లో రెండు అడుగుల మేర నీటిని ఖాళీ చేశారు. ఇదే సమయంలో ఎన్ఎన్డీపీ పనులు జరిగే స్థలాల్లో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా 18 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. మరో వైపు సహాయక చర్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కాల్సెంటర్ 040-2111 1111 నుంచి అందుతున్న సందేశాలపై అప్రమత్తంగా ఉండి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ ) : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా మేరకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకుగానూ 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి. మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీమ్లలో షిప్టుల వారీగా ప్రతి టీమ్లో నలుగురు కార్మికులు ఉన్నారు. ఒక వాహనంతో పాటు, గునపాలు, పారలు, నీరు తొలగించే పంపుసెట్లు, భద్రత సాధనాలు బూట్లు, రెయిన్ కోట్లు, రేడియం జాకెట్లు, గొడుగు, టార్చిలతో సిద్ధంగా ఉంచారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాలు, క్యాచ్పిట్ల వద్ద నిలిచిన నీటిని తొలగించనున్నారు. దీంతో పాటు ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్ (పర్యవేక్షకులు)గా నియమించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదను అంచనా వేసి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు చెరువుల వరదపై అప్రమత్తంగా ఉండటం లాంటి చర్యలు చేపడతారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా చెరువుల్లో రెండు అడుగుల మేర నీటిని ఖాళీ చేశారు. అకస్మాత్తుగా కుండపోత వర్షానికి ఆయా చెరువుల్లోకి భారీ వరద వచ్చి చేరినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఎస్ఎన్డీపీ పనులు జరిగే స్థలాల్లో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా బారికేడ్ల ఏర్పాట్లు, రోడ్లు మూసివేత, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు వాటిపై దృష్టి సారించారు. ప్రాజెక్టు విభాగానికి సంబంధించి 18 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు.
గ్రేటర్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా జోనల్ కమిషనర్లు, ఎస్ఈ, ఈవీడీఎం మాన్సూన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా ఈవీడీఎం సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా మేరకు జోనల్, సర్కిల్, వార్డు స్థాయిలో అధికారులు పలు సూచనలు పాటించాలని సూచించారు. వార్డు టౌన్ ప్లానర్లు సంబంధిత వార్డులను పరిశీలించి శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, కొనసాగుతున్న సెల్లార్ పనులను గుర్తించి సంబంధిత ఏసీపీకి నివేదించాలని మేయర్ పేర్కొన్నారు. శిథిలమైన నిర్మాణాల విషయంలో వాటిని కూల్చివేయడం సాధ్యం కానీ పక్షంలో, నివాస స్థలాలను ఖాళీ చేసి మానవ నష్టాన్ని నివారించేందుకు భవనాన్ని మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెల్లార్ పనులు కొనసాగుతున్న సందర్భంలో అనుమతించబడితే అన్ని భద్రతా చర్యలు , మట్టిని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటున్నట్లు నిర్ధారించుకోవాలన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మట్టి జారడం, పొరుగు నిర్మాణాలు దెబ్బ తినే అవకాశం ఉందని, ఇంకా కొత్త సెల్లార్ తవ్వకాలను అనుమతించకూడదని మేయర్ స్పష్టం చేశారు. కంట్రోల్ రూం , ఐఎండీ, జీహెచ్ఎంసీ కాల్సెంటర్ 040-2111 1111 నుంచి అందుతున్న ఫిర్యాదులపై అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా అక్కడక్కడ తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 95 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెను వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవగా, జీహెచ్ఎంసీ గ్రీవెన్స్సెల్, టోల్ఫ్రీ నంబరుకు ప్రజలు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు…12 ప్రాంతాల్లోని ఫిర్యాదులను పరిష్కరించారు.11 చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడగా…ఒక చోట అగ్ని ప్రమాదం జరగగా నివారణ చర్యలు చేపట్టారు. పౌరులు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో డీఆర్ఎఫ్ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతుందని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.