సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ) : బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్లోని జీహెచ్ఎంసీ స్థలాన్ని అక్రమించేందుకు యత్నిస్తున్న కొంత మంది వ్యక్తులు తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండిపడ్డారు. శనివారం ఎన్బీటీ నగర్లో పెండింగ్ పనులను పరిశీలించేందుకు జోనల్ కమిషనర్ వెంకటేష్, డీఎంసీ ప్రశాంతితో పాటు అధికారులతో కలిసి తాను పర్యటించిన సమయంలో కొంతమంది వ్యక్తులు తనతో పాటు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు.
అక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితమే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కేటాయించడంతో పాటు రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మేయర్ వివరించారు. సీఎం కేసీఆర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఈ స్థలాన్ని నిర్మాణ పనులకు జీహెచ్ఎంసీకి అప్పగించారన్నారు. సదరు స్థలాన్ని అక్రమించేందుకు కొందరు ప్రయత్నించడంతో పాటు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని వివరించారు.
వారి ఆగడాలను బస్తీ వాసులతో పాటు అధికారులు గతంలోనే అడ్డుకున్నారని, అక్రమణలు తొలగించడంతో పాటు ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేశామని మేయర్ పేర్కొన్నారు. వాస్తవాలను గుర్తించకుండా కొందరు వ్యక్తులు తన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మేయర్ ఆరోపించారు.
పేదలకు ఉపయోగపడేలా మల్టీపర్పస్ ఫంక్షన్హాల్కు కేటాయించిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా కానిచ్చే ప్రసక్తే లేదని మేయర్ స్పష్టం చేశారు. కొంత మంది దురుద్దేశపూర్వకంగా తన వీడియోలను వైరల్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, జీహెచ్ఎంసీ స్థలాన్ని అక్రమిస్తే సహించేది లేదని మేయర్ హెచ్చరించారు.