కొవిడ్ మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జర్నలిస్టులు, ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రధానంగా ఫ్రంట్లైన్ వర్కర్లు అయిన మున్సిపల్ సిబ్బందితో పాటు జర్నలిస్టుందరూ వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు రెండో విడత వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పారిశుధ్య వర్కర్లందరికీ వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 120 మంది జర్నలిస్టులు, ఉద్యోగులు వ్యాక్సిన్ ఇచ్చినట్లు మేయర్ ఈ సందర్భంగా చెప్పారు.
జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం వరకు 22,894 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ తెలిసింది. పారిశుధ్య, ఎంటమాలజి తదితర విభాగాలకు చెందిన 24,949 మంది కార్మికులు ఉండగా, వీరిలో 92 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మిగిలిన వారు సెలవుల్లో ఉండటం, అనారోగ్య కారణాలు, ఉద్యోగ ఖాళీలు ఉండటం వలనే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. మిగిలిన వారిలో ముందుకు వచ్చే వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.