మాతృదేవో భవ అనాథ ఆశ్రమం సేవలకు ప్రశంసలు
108 అవార్డులిచ్చిన పలు స్వచ్ఛంద సంస్థలు
బడంగ్పేట, ఏప్రిల్ 19: మతిస్థిమితం లేని వారిని చేరదీస్తారు. కన్నబిడ్డల్లా ఆలనాపాలనా చూస్తున్నారు. ఒకరా ఇద్దరా మొత్తం వివిధ రాష్ర్టాలకు చెందిన 85 మందికి ఆశ్రయం కల్పిస్తూ వారికి కావల్సినవన్నీ అందిస్తున్నారు మాతృదేవోభవ అనాథ ఆశ్రమం నిర్వాహకుడు గట్టు గిరి. తన అన్న మతిస్థిమితం కోల్పోయి ఇంటికి దూరం కావడంతో అనాథలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న గిరి 2011లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవోభవ ఆశ్రమం ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఈ ఆశ్రమం సేవలను పలు స్వచ్ఛంద సంస్థలు మెచ్చుకుంటున్నాయి. మంత్రులు, జిల్లా కలెక్టర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో 85 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారు ఆశ్రయం పొందుతున్నారు. ఇందులో కొందరు ఉన్నత విద్యావంతులున్నారంటే అతిశయోక్తి కాదు. తమిళనాడుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేసి ఇండియాకు తిరిగి రాగా అదే సమయంలో అతడి తల్లి మరణించింది. ఇది తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. ఇల్లు వదిలేసి వచ్చి హైదరాబాద్లో తిరుగుతుండగా మాతృదేవోభవ ఆశ్రమం సభ్యులు చేరదీశారు. ఇదిలా ఉంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్న సభ్యులకు ఒకరి భాష మరొకరికి రాదు. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు గిరి మాత్రం వారి హావభావాలను అర్థం చేసుకుంటూ సైగలతో వారికి కావాల్సినవి సమకూర్చుతాడు. అంతేకాక ఇక్కడ చేరిన వారికి వైద్య సేవలు అందిస్తాడు. కోలుకున్న వారిని స్వస్థలాలకు పంపుతాడు.
యాద్రాది భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురానికి చెందిన రాములు ముత్తమ్మ దంపతుల రెండో సంతానం గట్టు గిరి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గిరి పదో తరగతి వరకే చదివారు. అయితే గిరి అన్న వెంకటేశ్ మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి చనిపోయాడు. ఈ ఘటన గిరిని కలిచివేసింది. ఆ రోజే మతిస్థిమితం లేని వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రస్తుతం ఎందరికో సేవలందిస్తున్నాడు.