Ragidi Lakshma Reddy | ఉప్పల్, జూన్ 20 : ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి బ్యాడ్జ్లను, ప్లేట్లను పంపిణీ చేశారు.
రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తాను గత 26 సంవత్సరాల నుండి మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని, పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తన వంతు సహాయంగా నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ప్లేట్లు అందిస్తున్నామని చెప్పారు. అలాగే క్రీడా సామాగ్రి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికం అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పైచదువులు చదవలేని విద్యార్థులకు తమ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు, విదేశీ చదువులు చదువుకునే వారికి ప్రోత్సాహకాలు అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగిందని రాగిడి లక్ష్మారెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఘనత మధుర చారిటబుల్ ట్రస్ట్ది అని ఆయన తెలియజేశారు. రాబోవు రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని రాగిడి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.