బంజారాహిల్స్, డిసెంబర్ 22: బంజారాహిల్స్ పరిధిలోని ఫిలింనగర్లో భారీ చోరీ జరిగింది. ఆభరణాల తయారీ సంస్థ కార్యాలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు.. సుమారు కోటి విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను తస్కరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన నల్లబోతు చెంచురామయ్య మనవడు పవన్కుమార్ 2016 నుంచి శమంతక డైమండ్స్ పేరుతో వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్నాడు. ఫిలింనగర్ వెంచర్- 2లో ఇటీవల కొత్త ఇంట్లోకి మారిన పవన్ కుమార్..
అక్కడే ఆభరణాలు తయారు చేయించి విక్రయిస్తున్నాడు. కాగా, ఈనెల 20న రాత్రి 10 గంటలకు షోరూమ్లో పనిచేసే జీవన్ తాళాలు వేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఉదయం వచ్చి చూడగా.. షోరూమ్లోని వస్తువులు చిందరవందరంగా పడి ఉన్నాయి. ఆభరణాలు తయారు చేసి భద్రపరిచే క్యాబిన్స్, లాకర్లలో పెట్టిన 200 క్యారెట్ల డైమండ్లు, 300 గ్రాముల బంగారం, 100 గ్రాముల బంగారు వజ్రాల హారంతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమయ్యాయి. షోరూమ్ వెనకాల కిటికీ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించి, చోరీకి పాల్పడి ఉంటారని సంస్థ నిర్వాహకుడు పవన్ కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సుమారు కోటి విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలం నుంచి బంజారాహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. షోరూమ్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, నంబర్ ప్లేట్ లేని యాక్టివా బైక్పై గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు వెళ్లినట్లు కనిపించడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
పోలీసుల అదుపులో ఓ నిందితుడు..
ఫిలింనగర్లో చోరీకి పాల్పడిన నిందితుల్లో ఒకరిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చోరీ జరిగిన తర్వాత సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను గుర్తించారు. పట్టుబడిన నిందితుడు మాంగార్ బస్తీకి చెందిన వ్యక్తిగా తెలిసింది.