హిమాయత్నగర్, డిసెంబర్ 1: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో టూరిజం ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్లోని టూరిజం ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ విభాగంలో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయం లోపల దట్టమైన పొగలు వచ్చి.. మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది నారాయణగూడ పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫర్నీచర్ తదితర వస్తువులు కాలిపోయాయి. అదే విధంగా.. మంటలు చెలరేగడంతో కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్లపై అగ్ని కీలలు పడటంతో అవి కూడా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. టూరిజం సంస్థ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈ.టి.నరసింహ, నగర కార్యదర్శి ఎస్.ఛాయదేవి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్ని ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.