BJP-Congress | సిటీబ్యూరో/బేగంపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన కుటుంబం అది. వారే దివంగత సీఎం మర్రి చెన్నారెడ్డి వారసుడు మర్రి శశిధర్రెడ్డి, ఈయన కుమారుడు ఆదిత్యరెడ్డి. ఈ తండ్రీకొడుకులు ఇద్దరు సనత్నగర్ నియోజకవర్గ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తండ్రి శశిధర్ రెడ్డి బీజేపీ తరఫున పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి తనకే టికెట్ వస్తుందంటూ ఆయన కుమారుడు ఆదిత్యరెడ్డి నియోజకవర్గంలో జోరుగా తన తాత చెన్నారెడ్డి ఫొటోతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్లు టికెట్ ప్రకటించకపోయినా ఈ ఇద్దరు తండ్రి, కొడుకులు మాత్రం ఎన్నికల ప్రచారంలోకి దిగారు. కొంత కాలంగా వీరు తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ ఎత్తుగడలతో రెండు వేర్వేరు పార్టీలను ఎంచుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
మర్రి చెన్నారెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో కుటుంబ సభ్యులు విఫలమయ్యారనే వ్యాఖ్యలు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. మర్రి శశిధర్రెడ్డి సనత్నగర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. కానీ ప్రజల్లో ఉంటూ వారి బాధలను పంచుకోవడంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. రెండు సార్లు టీడీపీ అభ్యర్థుల చేతుల్లో పరాజయాన్ని చూశారు. గత ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన కాంగ్రెస్.. సనత్నగర్ నుంచి బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఎదుర్కొనేందుకు తమ కంటే టీడీపీయే బలమైన అభ్యర్థిని బరిలో ఉంచగలదనే ఆలోచనతో టికెట్ను టీడీపీకి అంకితం చేసింది. దీంతో అంతంత మాత్రంగానే ఉన్న మర్రి పట్టు పూర్తిగా సడలింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడి మర్రి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సనత్నగర్లో బీజేపీ అంతంత మాత్రంగా ఉండటంతో మాజీ ఎమ్మెల్యే హోదాతో ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. మర్రి కుటుంబంలో మూడో తరం వారసుడు మర్రి ఆదిత్యరెడ్డి ఎన్నికల బరిలోకి దిగాడు. తండ్రి శశిధర్రెడ్డి వదిలేసి వెళ్లిన సనత్నగర్ కాంగ్రెస్ సీటును తనకు కేటాయించాలని కోరుతూ ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నట్టు సమాచారం.నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తాత మర్రి చెన్నారెడ్డి ఫొటోతో ఆదిత్యరెడ్డి ప్రచారం చేస్తున్నారు.
ఫ్లెక్సీ వార్ నుంచే మొదలైన చర్చ..
మర్రి ఆదిత్యరెడ్డి కొన్ని నెలలుగా నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ తనదేనంటూ ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తండ్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతుండగానే కొన్ని ఫ్లెక్సీలు నియోజకవర్గ పరిధిలో ఆదిత్యరెడ్డి వేయించారు. అందులో ఎక్కడా శశిధర్రెడ్డి పేరు, ఫొటో లేకపోవడంతో తండ్రీకొడుకుల మధ్య సఖ్యత లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు.
ఎడముఖం.. పెడముఖం అందుకేనా?
నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఆదిత్యరెడ్డి టిక్కెట్లు ఆశిస్తున్నారు. కొన్ని నెలల కింద కొన్ని కార్యక్రమాల్లో వీరు ఎదురు పడిన సందర్భాల్లో ఎడముఖం పెడముఖంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పదవుల్లో ఉండగా ఏనాడూ ప్రజల గురించి ఆలోచించని మర్రి కుటుంబ సభ్యులు తమ ఉనికిని కాపాడుకునేందుకు నియోజకవర్గంలో చేస్తున్న రాజకీయ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు టికెట్లు రెండు మూడు రోజుల్లో కేటాయించనున్నాయి. ఎవరు బరిలో ఉంటారు? ఇద్దరిలో ఎవరైనా ఒకరికి టికెట్ వస్తే అంతర్గత సహకారం ఎంత మేరకు ఉంటుంది? నియోజకవర్గ ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది.