సికింద్రాబాద్, సెప్టెంబర్ 17: భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కల్పించని విధంగా కార్మికులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. బోర్డు పరిధిలోని ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్కు చెందిన రాజు ఏడాది క్రితం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ షాక్తో మృతిచెందాడు. అప్పటికే భవన నిర్మాణ కార్మికుల కార్డు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మృతి చెందిన రాజుకు రూ.6లక్షల 30వేల 38 రుపాయల చెక్కు మంజూరైంది. ఈ క్రమంలో శుక్రవారం వార్డులోని మహాత్మాగాంధీనగర్లో కార్మిక భీమా కింద మంజూరైన రూ.6లక్షల 30వేల 38ల చెక్కును రాజు భార్య బాలలక్ష్మికి ఉద్యమకారుడు పెద్దాల నర్సింహతో కలిసి మర్రి రాజశేఖర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వార్డులో వందల మంది కార్మికులకు లేబర్ కార్డులను అందించడం జరిగిందన్నారు. కంటోన్మెంట్లోని ప్రతి కార్మికుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. కార్మికుడికి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.