కంటోన్మెంట్, ఆగస్టు 31: అన్ని రంగాలకు చెందిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కల్పించని విధంగా కార్మికులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. తిరుమలగిరిలోని ఎల్ఐసీ సమీపంలో ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, సాయిబాబా హాట్స్కు చెందిన డి. ఐలయ్య(50) కార్మిక గుర్తింపు కార్డు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ప్రమాదవశాత్తు మరణించాడు.
ఈ క్రమంలో మంగళవారం ఏడోవార్డు లాల్బజార్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మిక బీమా కింద మంజూరైన రూ.1.30లక్షల చెక్కును ఐలయ్య భార్య పుష్పకు బోర్డు మాజీ సభ్యుడు శ్యాంకుమార్తో కలిసి మర్రి రాజశేఖర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఏడోవార్డులో సుమారు వెయ్యి మంది కార్మికులకు లేబర్ కార్డులను అందించా మన్నారు.
కంటోన్మెంట్లోని ప్రతి కార్మికుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు పొందాలని సూచించారు.
కార్మికుడుగా పేరు నమోదు చేయించుకున్న వారికి పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2లక్షలు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2లక్షలు వర్తిస్తుందన్నారు. సాధారణ మరణమైతే రూ.30వేలు, పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు 50 శాతం అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.లక్ష పరిహారం వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్యారసాని గౌరీ శంకర్, నేతలు రాజారెడ్డి, యశ్వంత్ కుమార్, సుధాకర్, విజయ్, రాజు సాగర్, వేణు గోపాల్, గోపి, డిసౌజా, మహిళా నేతలు సువర్ణ, పద్మ, రజిని, వనజ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కార్డు గురించి తనకు ఏమీ తెలియదని మృతిచెందిన కార్మికుడు ఐలయ్య భార్య పుష్ప తెలిపింది. కార్మిక బీమా కింద తన భర్తకు వచ్చిన డబ్బులు విషయమై తెలియజేసి చెక్కు ఇస్తున్నందుకు ప్రభుత్వంతో పాటు మర్రి రాజశేఖర్రెడ్డికి, శ్యాంకుమార్లకు ఎంతో రుణపడి ఉంటానని చెప్పింది.