కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 9: ఏకంగా సీఎన్జీ సిలిండర్లో గంజాయిని తరలిస్తూ.. పోలీసులకు పట్టుబడిందో ముఠా. శుక్రవారం పేట్ బషీరాబాద్లో మేడ్చల్ జోన్ డీసీపీ నిఖితపంత్, ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్, మేడ్చల్ ఏసీపీ వెంకట్రెడ్డి, మేడ్చల్ సీఐ శివకుమార్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఎస్వోటీ, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా మేడ్చల్ ఓఆర్ఆర్ ఆక్సిజన్ పార్క్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు కార్లను పరిశీలించగా, ఓ వాహనం డిక్కీలో సీఎన్జీ ఖాళీ సిలిండర్ కనిపించింది. అందులో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. రెండు కార్లలో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని..విచారించగా, వారు యూపీకి చెందిన అరవింద్చౌదరి(28), అభిషేక్ తోమర్(36), ఆశిశ్కుశ్వంత్(25), ఆకాశ్సొలంకి(25)గా తేలింది.
ఇందులో అరవింద్చౌదరి ఓ మర్డర్ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఈ నలుగురు గంజాయి దందాను మొదలుపెట్టారు. ఈ మార్గంలో అనేక సార్లు గంజాయిని తరలించినట్లు తెలిపారు. ఇందులోభాగంగానే వైజాగ్లో 65 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేసి.. ఆగ్రాకు తరలించేందుకు సిద్ధమయ్యారు. కారు డిక్కీలో సీఎన్జీ సిలిండర్ మధ్యలో రంధ్రం చేసి తాళం బిగించి.. అందులో గంజాయిని దాచిపెట్టారు. మరో కారును ఈ వాహనానికి కాన్వయ్గా ఉపయోగించారు. చివరికి పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లతో పాటు రూ.40 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకొని.. రిమాండ్కు తరలించారు.