సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పాడేరు నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్రావు కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం, అనకాపల్లికి చెందిన వాకడ మధన్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. ఆరు నెలల కిందట హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడ యాదగిరినగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సినిమా షూటింగ్లలో లైట్ భాయ్గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చే సంపాదన సరిపోకపోవడంతో తన స్వస్థలం నుంచి గంజాయి తెచ్చి, హైదరాబాద్లో విక్రయించాలని ప్లాన్ వేశాడు. ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయించే వారితో పరిచయాలు పెంచుకున్నాడు.
పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మంచి క్వాలిటీ ఉన్న గంజాయి లభిస్తుంది. మీకు ఇక్కడకు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఒప్పుకుంటే అక్కడి నుంచి కొనుగోలు చేసి మీకు సరఫరా చేస్తానంటూ మాట్లాడుకున్నాడు. ఇందులో భాగంగా గంజాయిని కొనుగోలు చేసి ప్రైవేట్ బస్సుల్లో తెచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 26 కేజీల గంజాయి కొని, తన స్నేహితుడైన బాసబోయిన యుగేంధర్తో కలిసి హైదరాబాద్కు వచ్చాడు. విశ్వసనీయ సమాచారంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు బృందం జూబ్లీహిల్స్ పోలీసులతో కలిసి మధన్ ఇంటిపై దాడి చేయడంతో, ఇంట్లో దాచి ఉంచిన గంజాయి బయటపడింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద లభించిన గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుతో పాటు ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్, అశోక్రెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.