హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన జెనెటిక్ టెస్టింగ్, కౌన్సెలింగ్ సంస్థ మ్యాప్మైజెనోమ్ ఇండియా, జైమో రీసెర్చ్ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వానికి లక్ష కోవిడ్ టెస్ట్ కిట్లను విరాళంగా ఇచ్చింది. భారతదేశానికి ఒక మిలియన్ కిట్లు విరాళంగా ఇవ్వాలన్న జైమో రీసెర్చ్ చొరవలో భాగంగా మంత్రి కేటీఆర్కు మ్యాప్మైజెనోమ్ సంస్థ సీఈవో అను ఆచార్య వీటిని అందజేశారు. దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలలో కరోనా టెస్ట్ కిట్ల పంపిణీని సులభతరం చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తమ బృందం పనిచేస్తోందని తెలిపారు.
ఈ కోవిడ్ టెస్ట్ కిట్లో కొత్త DNA/RNA షీల్డ్ – డైరెక్ట్ డిటెక్ట్ రియేజెంట్, సేకరణ పరికరాలు ఉన్నాయని అను ఆచార్య చెప్పారు. ఈ కిట్తో నమూనాల సేకరణ, నిర్వహణ ఎంతో సురక్షితమని, చాలా తక్కువ సమయంలోనే టెస్ట్ ఫలితం వస్తుందని వివరించారు. ‘కరోనాపై పోరాటంలో భాగంగా పరీక్ష, నివారణకు మ్యాప్మిజెనోమ్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ ప్రయాణంలో జైమో రీసెర్చ్తో మా భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది’ అని ఆమె వెల్లడించారు.
కాగా, కరోనా కేసులు పెరుగుతున్న దేశాల్లో కోవిడ్ టెస్ట్ల నిర్వహణను డీఎన్ఏ/ఆర్ఎన్ఏ షీల్డ్-డైరెక్ట్ డిటెక్ట్ సులభతరం చేస్తుందని, స్వాబ్ సేకరణలోని పరిమితుల అడ్డంకులను ఇది తొలగిస్తుందని జైమో రీసెర్చ్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్క్ వాన్ ఈడెన్ అన్నారు. అవసరమైన వారికి మానవీయ సహకారం అందించడం తమ విధానమని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షను వేగంగా విస్తరించే, సులభతరం చేసే సామర్థ్యం ఉన్నందున మ్యాప్మిజెనోమ్తో జతకట్టనట్లు తెలిపారు.