సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : వరుస సెలవులతో నగరంలోని పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ చుట్టూ పలు పార్కులు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం, సోమవారం క్రిస్మస్ ఉండడంతో వరుస సెలవులు వచ్చాయి. దీంతో లుంబినీ పార్కు నుంచి మొదలు ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, జలవిహార్ పక్కన ఉన్న లేక్ ఫ్రంట్ వ్యూ పార్కు, సంజీవయ్య పార్కు, ట్యాంక్బండ్ ప్రాంతాలన్నీ రెండు రోజుల నుంచి పర్యాటకులతో నిండిపోయాయి.
ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయం.. హుస్సేన్సాగర్ను అనుకొనే ఉండడంతో ఈ ప్రాంతమంతా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. లుంబినీ పార్కులో నుంచి హుస్సేన్సాగర్ లోపల ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూసేందుకు కూడా పర్యాటకులు ఆసక్తి చూపారని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్క రోజే 20 వేల మందికి పైగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి వచ్చారని, అదేవిధంగా కొత్తగా ప్రారంభమైన లేక్ ఫ్రంట్ వ్యూ పార్కుకు 10 వేల మంది సందర్శకులు వచ్చారని, సోమవారం సైతం అదే స్థాయిలో సందర్శకుల తాకిడి హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న పార్కుల్లో ఉందని తెలిపారు.
జంట జలశయాల్లో ఒకటైన గండిపేటలో హెచ్ఎండీఏ నిర్మించిన లేక్వ్యూ పార్కును నగర వాసులు ఎక్కువగా సందర్శిస్తున్నారు. సెలవు రోజుల్లో 10వేల మంది సందర్శకులు గండిపేట పార్కుకు వస్తున్నారని, క్రిస్మస్ సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగిందని పార్కు నిర్వాహకులు తెలిపారు.