మన్సూరాబాద్, ఏప్రిల్ 8: అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి.సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం, గోసుకొండ గ్రామానికి చెందిన వరికుప్పల శివకృష్ణ (29) ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో దొంగతనాలు చేయాలని పథకం వేసుకున్నాడు. ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను ఎంచుకుని చైన్స్నాచింగ్కు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. అబ్ధుల్లాపూర్మెట్ మండలం, బండరావిరాల గ్రామానికి చెందిన ముల్లి బాలమ్మ (65) పని నిమిత్తం శుక్రవారం బయటకు వెళ్లి సద్దుపల్లి క్రాస్రోడ్స్ నుంచి బండరావిరాల గ్రామానికి నడుచుకుంటూ వస్తుంది.
బాలమ్మ వద్దకు వచ్చిన శివకృష్ణ తాను అటువైపుగా వెళ్తున్నానని.. తన బైకుపై ఎక్కాలని కోరాడు. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమె బైకు ఎక్కింది. కొంత దూరం వెళ్లిన అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని బైకుపై పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు అబ్ధుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి గువ్వలేటి క్రాస్రోడ్స్ వద్ద శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారింగా చైన్స్నాచింగ్ విషయం బయటపడింది. నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, అబ్ధుల్లాపూర్మెట్ సీఐ స్వామి, డీఎస్ఐ విక్రంరెడ్డి పాల్గొన్నారు.