హైదరాబాద్: హైదరబాద్ గచ్చిబౌలిలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను (Pregnant Wife) నడిరోడ్డుపై పడేసి సిమెంట్ ఇటుకతో దాడిచేశాడో భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య దవాఖానలో చికిత్స పొందుతున్నది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. వికారాబాద్కు చెందిన ఎండి.బస్రత్ (32) హఫీజ్ పేట్లోని ఆదిత్యనగర్లో ఉంటూ ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా బస్సులో పశ్చిమ బెంగాల్కు చెందిన షబానా పర్వీన్ (22) పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో 2024 అక్టోబర్లో కోల్కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరు ఆమెను హఫీజ్పేటకు తీసుకొచ్చాడు. పర్వీన్ ఒత్తిడితో అదే బస్తీలో వేరుకాపురం పెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరిమధ్య గొడవలు అవుతున్నాయి.
ఈ క్రమంలో పర్వీన్ ఇటీవల గర్భం దాల్చింది. మార్చి 29న వాంతులు కావడంతో దవాఖానలో చేర్పించాడు. రెండు రోజుల చికిత్స అనంతరం ఏప్రిల్ 1న రాత్రి 10 గంటల సమయంలో భార్యను డిశ్చార్జ్ చేసుకుని హాస్పిటల్ నుంచి బటయకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ వారు గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా షబానాపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కాలితో తన్నాడు. దీంతో కిందపడిన ఆమె తలపై అక్కడే ఉన్న ఓ సిమెంట్ ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. షబానాను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడు బస్రత్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.