సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): పేట్లబుర్జు ప్రసూతి దవాఖానలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిదే హవా నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు గతంలో అక్రమాలకు పాల్పడి, పోలీసు కేసులు సైతం ఎదుర్కొని, ఉద్యోగంలోనుంచి తొలగింపునకు గురైనా కొందరు అధికారులు తమ స్వలాభం కోసం తొలగించిన వారినే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 2022లో జరిగిన పీజీ వైద్య విద్యార్థుల వార్షిక పరీక్షలో డబ్బులు ఇవ్వనందుకు ఫెయిల్ చేశారంటూ ఒక పీజీ విద్యార్థిని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి డీఎంఈ డా.రమేశ్రెడ్డి జరిగిన ఘటనపై విచారణ జరిపి, అప్పటి సూపరింటెండెంట్ డా.నాగమణి, ప్రసూతి (ఓబీజీ)విభాగ అధిపతి డా.గరుడ లక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ క్రాంతికుమార్, సెక్యూరిటీ సూపర్వైజర్ వెంకట్ చాట్ల(ఔట్సోర్సింగ్)లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారందరిని ఉద్యోగాల నుంచి తప్పించారు. కాగా పీజీ వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో దవాఖానకు చెందిన జూనియర్ అసిస్టెంట్ క్రాంతికుమార్, సెక్యూరిటీ సూపర్వైజర్ వెంకట్ చాట్ల తదితరులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అయితే 2024లో ప్రభుత్వం మారడంతో దవాఖానలో అధికారులు సైతం మారారు. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వెంకట్ చాట్లను ఫిబ్రవరిలో తిరిగి సెక్యూరిటీ అండ్ శానిటేషన్ ఇన్చార్జిగా తీసుకున్నారు. దవాఖాన ప్రాంగణంలో గత ప్రభుత్వం పార్కింగ్ ఫీజును తొలగించిందని, కొంత మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది అనధికారికంగా రోగి సహాయకుల వద్ద నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసుకు సంబంధించి, అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులందరికీ విజిలెన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఉద్యోగులందరూ వారి వారి పోస్టింగ్లలో చేరారు. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఔట్సోర్సింగ్ సిబ్బంది మా కంట్రోల్లో ఉండరు. కొందరు ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాల్లో కోత విధిస్తున్నట్లు వింటున్నాం. ఆ అంశం కూడా మా పరిధిలోనిది కాదు. దవాఖానలో ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. ఎవరైన పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి.