సిటీబ్యూరో/కంటోన్మెంట్, నవంబర్ 16: మ్యాట్రీమోని వెబ్సైట్ పేరుతో మహిళలను మోసం చేయడమే గాకుండా.. నగలను కాజేస్తున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి నగలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహంకాళి ఏసీపీ రవీందర్ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నేదునూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్ రెడ్డి అలియాస్ శ్రీనాథ్(38) ప్రైవేట్ ఉద్యోగి. సులువుగా డబ్బు సంపాదించేందుకు మ్యాట్రీమోని పేరుతో అమాయక మహిళలు, యువతులను మోసం చేస్తున్నాడు. నిందితుడు భరత్ మాట్రీమోని పేరుతో నకిలీ వెబ్ సైట్ను క్రియేట్ చేశాడు. ఈ మ్యాట్రీమోని వెబ్సైట్ ద్వారా ఓ యువతి పరిచయమయ్యింది. ఈనెల 8వ తేదీన ఆ యువతిని సికింద్రాబాద్లోని ఓ లాడ్జికి రావాలని సూచించాడు. అతడు చెప్పిన ప్రకారం ఆమె (బాధితురాలు) లాడ్జికి వెళ్లి శ్రీనాథన్ను కలిసింది. ఆమె బ్యాగు పక్కన బెట్టి.. బాత్రూంకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత ఆమె వచ్చి చూడగా.. అక్కడ బ్యాగు కనిపించలేదు.. అతడు కూడా అదృశ్యమయ్యాడు. ఆ బ్యాగులో 27 తులాల బంగారు నగలున్నాయి. దీంతో బాధితురాలు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
నిందితుడి నేర చరిత్ర..
నిందితుడిని విచారించగా పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా నిందితుడు చాలా మంది యువతులను మోసం చేసినట్టు విచారణలో వెల్లడైంది. రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నిందితుడు టీచర్గా పని చేసినట్టు పోలీసులు గుర్తించారు. 2011లో బాలికను వేధించిన కేసులో అరెస్టయిన నిందితుడు.. మూడు నెలల పాటు జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన అతడు తిరిగి నేరాలు చేయడం మొదలు పెట్టాడు. నిందితుడిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా నేరాలు చేస్తున్న నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్ఫోన్, 27 తులాల బంగారు నగలు, కోటక్ మహేంద్రా చెక్ బుక్, హెచ్డీఎప్సీ క్రెడిట్ కార్డు, జోయాలుక్కాస్, లలితా జ్యూవెల్లరీ ఇన్వాయిస్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.