అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి
అమీర్పేట్, జూన్ 6: ప్రకృతితో మమేకమై మనుగడ సాగించడం భారతీయ సంస్కృతిలో భాగమని అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈపీటీఆర్ఐ డీజీ వాణీప్రసాద్, పీసీబీ సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పీసీబీ కార్యాలయంలో మొక్కలు, వాటి పెంపకానికి ఉపయోగపడే పరికరాలకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా 250 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ సంవత్సరం కూడా 19 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీబీ అప్పీలేట్ అథారిటీ చైర్మన్ ప్రకాశ్రావు, స్టాండింగ్ కౌన్సిల్ శివకుమార్, ఆనంద్రావు, కృష్ణారెడ్డి, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతులు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని జవహర్ బాలభవన్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన వారికి మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి బహుమతులను అందజేశారు. అదేవిధంగా పరిశ్రమల నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సంస్థల యాజమాన్యాలను మంత్రి అవార్డులతో సత్కరించారు.