బంజారాహిల్స్, జూన్ 16: తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నది. ఐదేండ్ల కిందట రషీద్ను పెండ్లి చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఏడాది కిందట భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. నాలుగు నెలల కిందట ఆమెకు శంకర్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో సహజీవనం చేస్తున్నారు.
ఇటీవల తనను పెండ్లి చేసుకోవాలంటూ.. శంకర్ కోరగా, ఆమె నిరాకరించింది. శంకర్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాటు చోరీ కేసులో అరెస్టయిన కారణంగా అతడిని వివాహం చేసుకోనంటూ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నెల 14న మరోసారి ఇదే విషయంలో ఘర్షణ పడ్డారు. అదే రోజు సాయంత్రం రహ్మత్నగర్లో ఓ ఈవెంట్ కోసం వచ్చిన ఆమె తన కొడుకు(2)ను సమీపంలో నివాసముంటున్న స్నేహితురాలు ఇంట్లో వదిలిపెట్టి వచ్చింది. అక్కడకు వెళ్లిన శంకర్ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్లిపోయాడు. శంకర్కు ఫోన్ చేసినా.. స్విచ్ఛాఫ్ రావడంతో బుధవారం రాత్రి సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శంకర్పై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. అతడు నాందేడ్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లారు.