ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చి.. ‘సైబర్’కు చిక్కిన ప్రైవేటు టీచర్
‘సిబిల్ స్కోర్’ ఎక్కువ ఉన్న వారిని పరిచయం చేయమన్న ఆగంతకుడు
3 శాతం కమీషన్ ఇస్తానంటూ.. ఆఫర్
14 మంది వివరాలు అందించిన బాధితుడు
వారి ధ్రువీకరణ పత్రాలతో ఖరీదైన ఫోన్లు కొన్న నేరస్తుడు
ఈఎంఐలు కట్టాలని సందేశాలు రావడంతో లబోదిబోమన్న బాధితులు
సిటీబ్యూరో, మే 29(నమస్తే తెలంగాణ) : తన కారును ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టి.. అన్యూహంగా సైబర్ నేరగాడికి చిక్కాడో ప్రైవేటు టీచర్.. 3 శాతం కమీషన్కు ఆశపడి.. ‘సిబిల్’ స్కోర్ ఎక్కువ ఉన్న వారిని పరిచయం చేసి.. వారితో పాటు కష్టాలను కొనితెచ్చుకున్నాడు.
కమీషన్ ఆశచూపి..
మోత్కురుకు చెందిన సదరు ప్రైవేటు ఉపాధ్యాయుడు ఇటీవల తన కారును అమ్మేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇవ్వగా, వీరనారాయణ అనే వ్యక్తి ఫోన్ చేసి.. తాను కారు కొంటానంటూ.. జెస్ట్మనీ, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో బాధితుడు తనకు రుణం ఇప్పిస్తారా అని అడిగాడు. దీంతో అతడు ఆధార్, పాన్కార్డు పంపించమన్నాడు. మరుసటి రోజు ఫోన్ చేసి.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో రుణం తిరస్కరించబడిందని చెప్పాడు. ఎవరైనా సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్న వారిని పరిచయం చేస్తే..వారు తీసుకున్న రుణంపై మూడు శాతం కమీషన్ ఇస్తానని నమ్మించాడు. దీంతో ఆ ప్రైవేటు టీచర్ తన 14 మంది స్నేహితులకు వీరనారాయణ నంబరు ఇచ్చి.. రుణం కోసం సంప్రదించాలని చెప్పాడు. ఈ క్రమంలో వీరనారాయణ దగ్గర నుంచి పాన్, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. బ్యాంక్తో అనుసంధానమైన ఫోన్ నంబర్లను కూడా సేకరించాడు. ఆ తర్వాత వీటితో వీరనారాయణ జెస్ట్ మనీలో లింక్ పంపించి.. అందులో వివరాలను నింపి ఓటీపీలను చెప్పమన్నాడు. ఇక్కడే గోల్మాల్ జరిగింది.
మొబైల్ ఫోన్లు కొనేశాడు..
ఇలా ఓటీపీలు సేకరించిన వీరనారాయణ.. ఆ 14 మంది ధ్రువీకరణపత్రాలతో రూ. 8.15 లక్షలు విలువ చేసే 14 ఖరీదైన మొబైల్ ఫోన్లను జెస్ట్మనీ ద్వారా కొనుగోలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత వారందరికీ మొబైల్స్కు సంబంధించిన ఈఎంఐలు కట్టాలంటూ సందేశాలు, ఫోన్లు వస్తుండడంతో వారంతా కంగుతిన్నారు. వెంటనే ప్రైవేటు టీచర్ను సంప్రదించగా, అతను వీరనారాయణతో వాట్సాప్ కాల్తో మాట్లాడాడు. మా ఉద్యోగులు ప్రొడక్ట్ టు లోన్ అని రాయబోయి.. ప్రొడక్ట్ టు పర్ఛేస్ అని రాయడంతో అలా జరిగిందని నమ్మించాడు. రూ. 8.15 లక్షలకు విలువ చేసే చెక్కులు పంపిస్తానని చెప్పి వాటి ఫొటోలను పంపాడు. ఆ చెక్కులు ఫేక్ అని తేలడంతో వీరనారాయణ మోసం చేశాడని గుర్తించిన ఆ పద్నాలుగు మంది.. సదరు ప్రైవేటు టీచర్ను పట్టుకున్నారు. చివరికి అందరూ కలిసి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కెమికల్ వ్యాపారీకి 53 లక్షలు టోకరా
ఓ కెమికల్ వ్యాపారికి రూ. 53 లక్షల టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. బోడుప్పల్కు చెందిన సదరు వ్యాపారి పాలీ ఆయిల్ కోసం ఓ కంపెనీని ఈమెయిల్స్, వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. అయితే ఆ కంపెనీ వారు 40 ఫిట్ల కంటైనర్ సరుకు మాత్రమే డెలివరీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు ఆర్డర్ ఇచ్చి.. అమెరికాలో ఉన్న సంస్థ ఖాతాలో డబ్బులు జమ చేయగా, 15 రోజుల్లో సరుకు పంపిస్తామని ట్రాకింగ్ లింక్ పంపించారు. దాని ద్వారా సరుకు ముంబై పోర్టులో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వాటిని తీసుకొచ్చేందుకు నగరంలోని ఓ లాజిస్టిక్స్ సంస్థను సంప్రదించాడు. అయితే బిల్లుల్లో 125 డ్రమ్ములు ఉంటే.. 119 మాత్రమే ఉన్నాయి. పైగా చిరునామా కూడా వేర్వేరుగా ఉంది. దీంతో సదరు కెమికల్ వ్యాపారి అమెరికా సంస్థ అంటూ.. మాట్లాడిన వారిని సంప్రదిస్తే..ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.