బంజారాహిల్స్ : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్నగర్లో నివాసం ఉంటున్న సయీద్ బిన్ మాబ్రుక్ (40) అనే వ్యక్తి ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు.
2005లో అతడికి షాహీన్బేగంతో పెండ్లి అవగా వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 9న భర్తతో గొడవపడిన షాహీన్ బేగం కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శనివారం రాత్రి భార్యను తీసుకువచ్చేందుకు సయీద్ బిన్ ఆమె వద్దకు వెళ్లినా ఇంటికి రాలేదు.
దీంతో మనస్థాపానికి గురైన సయీద్ అర్థరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం 8గంటలకు కుమార్తె అమీనాబేగం లోనికి వెళ్లి చూడగా తండ్రి మృతదేహం కనిపించింది. ఈ మేరకు మృతుడి సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.