సోదరిపై దాడి జరగొచ్చనే అనుమానంతో
ఆయుధంతో వచ్చిన యువకుడు
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కోర్టుకు ఓ యువకుడు కత్తితో రావడం కలకలం రేపింది. కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ను దాటుతున్న సమయంలో వచ్చి ‘బీప్’ శబ్దంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వనస్థలిపురం ప్రశాంత్నగర్కు చెందిన శ్రీపద సాయికిరణ్ గ్రాఫిక్ డిజైనర్. బుధవారం తన సోదరితో కలిసి రంగారెడ్డి జిల్లా కోర్టులో విడాకుల కేసుకు సంబంధించిన విచారణ కోసం వచ్చారు. ఆ సమయంలో కోర్టు ప్రధానద్వారం వద్ద ఏర్పాటు చేసిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ను దాటుకొని.. వెళ్తున్న సమయంలో బీప్ శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాయికిరణ్ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతడి వద్ద కత్తి దొరికింది.
సాయికిరణ్ సోదరి మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడిపోయి విడాకుల కోసం కోర్టులో పిటిషన్ను వేశారు. ఇటీవల సరూర్నగర్లో జరిగిన నాగరాజు హత్యతో కొంత కలవరానికి గురైన సాయికిరణ్ తన సోదరిపై దాడి చేస్తారనే అనుమానంతో కోర్టుకు వచ్చే క్రమంలో కత్తిని పెట్టుకొని వచ్చినట్లు విచారణలో తేలింది. సాయికిరణ్ను అరెస్టు చేసిన ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.