జవహర్నగర్, నవంబర్ 28: మేడ్చల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని, ప్రజలంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లో మంగళవారం కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ భారీ బైక్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ గాలే వీస్తున్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని, కాంగ్రెస్ వస్తే కారు చీకట్లు, భూ కుంభకోణాలకు అడ్డాగా మారుతున్నదన్నారు.
కాంగ్రెస్లో నెలకో సీఎం మారుతారని, ప్రజా పాలన అందించే బీఆర్ఎస్ వైపే మేడ్చల్ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. మరోసారి అవకాశం ఇస్తే జవహర్నగర్ను మరింత అభివృద్ధి చేసి మాడల్గా నిలుపుతానని తెలిపారు. బైక్ ర్యాలీలో మల్లారెడ్డి ఉత్సాహం కార్యకర్తల్లో నూతనోత్తేజం నెలకొంది. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్ శారదా మనోహర్రెడ్డి, మేక లలితా యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు మేకల భార్గవ్ రామ్, రాజశేఖర్, ప్రసాద్, సతీశ్ యాదవ్, వెంకటేశ్, నవీన్, అహ్మద్ పాషా, సాధిక్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.