ఎర్రగడ్డ : బోరబండ సైట్-2 కాలనీలోని శ్రీభ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో మల్లన్న జాతర శనివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో భాగంగా తొలిరోజు తెప్పోత్సవంతో కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఆదివారం స్వామివారి కల్యాణం, అన్నప్రసాదం, పెద్ద పట్నం, అగ్ని గుండాలు, గొలుసు తెంపుట, మల్లన్నస్వామి బోనాలు, ఎల్లమ్మతల్లి బోనాలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ మానుక మహేష్యాదవ్ తెలిపారు. సోమవారకం నాగవెళ్లి కార్యక్రమంతో జాతర ముగుస్తుందన్నారు.
ఏటా శివరాత్రి ముందు ఈ జాతరను జరపటం ఆనవాయితీగా వస్తున్నది. మల్లికార్జున స్వామి పురాతన ఆలయం స్థానంలో 2 ఏండ్ల క్రితం నూతన ఆలయాన్ని నిర్మించటం జరిగింది. స్వామివారి కల్యాణోత్సవం తదితర కార్యక్రమాలకుగాను ఆలయ ప్రాంగణంలో విశాలమైన పందిరిని ఏర్పాటు చేశారు.
ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. తొలిరోజు ఉత్సవాల్లో కమిటీ ప్రతినిధులు ఆంజనేయులు యాదవ్, శంకర్యాదవ్, వీరేష్యాదవ్, శివన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.