మేడ్చల్, జూలై 19(నమస్తే తెలంగాణ): రైతులకు 3 గంటలు కరెంటు చాలు అన్న రేవంత్రెడ్డికి పంట, వడ్లు, ఎడ్లు, తెల్వదని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటూ ముందుతీసుకెళ్తున్నదని అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో బుధవారం నిర్వహించిన రైతు వేదిక సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… టీపీసీసీ పదవిని కొనుక్కున్న రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్మి వ్యాపారం చేసేందుకు టీపీసీసీ పదవిని కొనుక్కున్నారని మంత్రి ఆరోపించారు. రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు. దేశమంతటా కాంగ్రెస్ దివాలా తీసిందని, వచ్చే ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందన్నారు.
3 పంటల బీఆర్ఎస్సే కావాలి : రైతులు
24 గంటల కరెంటు, 3 పంటల బీఆర్ఎస్ కావాలా? పాముకాటు 3 గంటల కాంగ్రెస్ కావాలా అని మంత్రి మల్లారెడ్డి రైతులను అడుగగా బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని రైతులు మూడుచింతలపల్లి రైతు వేదిక సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు, రైతులు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్
రాష్ట్రం ఏర్పడక ముందు భారంగా ఉన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి పండుగ చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, పంటలకు గిట్టుబాటు ధరలు అందించి దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్పై చేసిన వ్యాఖ్యలకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అన్ని వర్గాలతో పాటు రైతులందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉన్నారని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందన్నారు. జిల్లా ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి మేడ్చల్-మల్కాజిగిరికి ఏం చేశాడని ప్రశ్నించారు. ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి అభివృద్ధిని పట్టించుకోని రేవంత్ రెడ్డి.. రాష్ర్టానికి ఏమీ ఒరగబెడుతాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హారిక, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మహేందర్రెడ్డి, సర్పంచ్ రవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాకముందు అరిగోస…
తెలంగాణ రాక ముందు నీళ్లు లేవు, కరెంటు లేదు, నిద్రలేదు. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 24 గంటలు కరెంటు వచ్చింది. నీళ్లు వచ్చాయి. రైతుబంధు ఇస్తున్నారు. ఇంతకు మించి మాకు ఏమీ కావాలి. వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలు అన్నవారికి అసలు వ్యవసాయం గురించి తెలుసా. రైతులకే కాకుండా ప్రజలకు అన్ని రకాల సౌలతులు కల్పించిన కేసీఆర్ సారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.
-దాసరి నారాయణ, రైతు,మూడుచింతలపల్లి
వ్యవసాయం అంటే ఇట్లా ఉండాలే..
ఉమ్మడి పాలనలో వ్యవసాయం చేయాలంటే అన్నీ కష్టాలే. తెలంగాణ వచ్చినంక వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసిండు. 24 గంటలు కరెంటు, నీళ్లు, రైతుబంధు, బీమా, గిట్టుబాటు ధరలిచ్చి ఆదుకుంటున్నడు. అప్పులు చేసి వ్యవసాయం చేసే రోజులు పోయాయి. పంటలకు మంచి ధరలను ఇప్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చల్లగా ఉండాలే.
-ఉప్పలయ్య, రైతు, మూడుచింతలపల్లి
సంతోషంగా ఉన్నాం..
ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే మేము సంతోషంగా ఉన్నాం. పంట పెట్టుబడి ఇచ్చి, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతులతో సర్కార్ వ్యవసాయం చేయిస్తున్నది. అప్పుడున్న కష్టాలు ఇప్పుడు లేవు. పండించిన పంటలకు మంచి ధరలు సర్కారు అందిస్తున్నది. కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఇంకా మరింత మేలు జరుగుతది.
-సలమ్మ, మహిళా రైతు, మూడుచింతలపల్లి