మేడ్చల్, మార్చి 25 : విద్యార్థులు ఆకాశమే హద్దుగా సాగాలి, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు 100 శాతం ప్లేస్మెంట్ సాధించిన సందర్భంగా శనివారం ప్రిన్సిపాల్ మాధవీలత ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం సాధించడం జీవితంలో విజయ సాధించినట్టు కాదని, ఇంకా ముందుకు సాగాలన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లాలన్నారు. చేసే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలన్నారు. నిరంతర శ్రమ, ప్రణాళికతో సాగిపోవాలని సూచించారు. సాంకేతికంగా సమాజం అభివృద్ధి చెందిన నేపథ్యంలో మంచి ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందన్నారు. గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ తదితర కంపెనీలు నేడు ప్రపంచాన్ని యేలుతున్నాయంటే వినూత్న ఆలోచనే కారణమని గుర్తు చేశారు. విద్యార్థులు కంపెనీలు పెట్టే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సాధారణ పేద, మధ్య తరగతి గ్రామీణ విద్యార్థినులు 100 శాతం ప్లేస్మెంట్ సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ వీఎస్కే రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.