మల్కాజిగిరి, ఫిబ్రవరి 1: తక్కువ ధరకు బంగారమంటూ ఓ మహిళకు నకిలీ ఆభరణాలు ఇచ్చి డబ్బుతో ఉడాయించిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం.. న్యూ వెంటేశ్వరనగర్ నివాసి ఇంద్రజ పచ్చళ్ల వ్యాపారి. గత నెల 22న సాయంత్రం గుర్తు తెలియని ఓ మహిళతో పాటు మరో వ్యక్తి పచ్చళ్లు కావాలని వచ్చారు. దీంతో ఇంద్రజతో కొంత సేపు పచ్చళ్లపై మాట్లాడిన తర్వాత.. తమ వద్ద బంగారం ఉన్నదని, తక్కువ ధరకు ఇస్తామని చెప్పారు.
నేరగాళ్ల మాటలు నమ్మిన ఇంద్రజ వారి నుంచి ఆభరణాలు తీసుకొని..రూ.1.40లక్షలు ఇచ్చింది. దీంతో వారిద్దరూ వెళ్లిపోయారు. అనుమానంతో మరుసటి రోజు నగల దుకాణానికి వెళ్లి పరిశీలించగా.. నకిలీ బంగారు (రాగి) ఆభరణాలని తేలింది. దీంతో బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా, మల్కాజిగిరిలో నివసిస్తున్న కృష్ణా జిల్లాకు బాగి వెంకటేశ్వర్లు(46), తిరుపతమ్మ(40) భార్యాభర్తలు. వీరిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా నేరం అంగీకరించారు. ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.