ఉప్పల్, మార్చి 23 : ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని..మీ కుటుంబ సభ్యుడిగా.. సేవకుడిగా ఉంటానని.. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి లాగానే ముచ్చట్లు చెప్పి, ఓట్లు వేయించుకోవాలని మరికొంత మంది వస్తున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. మల్కాజిగిరిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఉప్పల్ నాచారంలో బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారీ మెజార్టీతో రాగిడిని గెలిపించి తీరుతామని నేతలు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘తెలంగాణ కోసం కోట్లాడింది కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్.. ప్రాణాలు లెక్కచేయకుండా రాష్ట్రం సాధించిన నాయకుడిని మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చేసిన కృషిని యువత మరువలేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతీసాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్రెడ్డి, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉప్పల్ నుంచి అధిక మెజార్టీని అందించి, భారీ అధిక్యంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాలి. బూత్స్థాయి నుంచి డివిజన్ వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి.
మల్కాజిగిరిలో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కలిసికట్టుగా పనిచేసి, పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుద్దాం. ప్రతిపక్షాలు చెప్పే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలి.