సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): సమాజంలో ఓ ప్రత్యేక గుర్తింపు.. ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో సివిల్స్లో ఉత్తీర్ణులైన విజేతలు తమ కలలను సాకారం చేసుకోబోతున్నారు. ముందస్తుగా రూపొందించుకున్న రూట్ మ్యాప్తో వారు విజయం సాధించారు. ఇక అన్ని వర్గాల ప్రజలకు సేవలందించడంతో పాటు పట్టణాభివృద్ధికి కూడా వ్యూహం రచించుకున్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడంతో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో రాణించగలిగామని 2020 బ్యాచ్ యువ సివిల్స్ విజేతలు ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. వీరు మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ను కుటుంబసభ్యులతో వచ్చి కలిశారు. వారిని సీపీ సన్మానించారు.
నేను సివిల్స్కు సన్నద్ధమవుతున్న సమయంలో చాలా మంది నాకు సహాయం చేశారు. వారందరి మద్దతుతో ఈరోజు ఈ స్టేజీలో ఉన్నా. గత ఏడేండ్ల నుంచి యువకులకు వాట్సాప్, ఆన్లైన్ ద్వారా పాఠాలు మొదలు పెట్టాను. పరీక్షలు పాసైన తర్వాత ఇంటర్వ్యూ కీలక ఘట్టం. వారిలో గందరగోళాన్ని తొలగించాలి. వారిని విజేతలుగా నిలిపే క్రమంలో వాట్సాప్, ఆన్లైన్ వేదికగా అవసరమయ్యే అంశాలను అందించాను. వీటిని అందిపుచ్చుకుని విజయం సాధించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.
తనతో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ యువ అభ్యర్థులకు తోడుగా ఉన్నారు. సివిల్స్ ఉద్యోగులుగా అడుగుపెడుతున్న యువతరం తమ విజయాన్ని తలకెక్కించుకోకుండా ప్రజలకు మేలైన సేవలందించాలి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తనతో పాటు ప్రముఖులు అందించిన ఆన్లైన్ పాఠాలతో 1000 మంది విజేతలుగా నిలిచారు. – మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
చదవడాన్ని ఎంజాయ్ చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందించాలనే కోరిక ఉంది. అది కూడా ఒక హక్కులాగా ప్రతి ఒక్కరికీ వైద్యం దొరకాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలతో సివిల్స్ సాధించాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఇక సివిల్స్లో విజయం సాధించాలని ఇష్టంతో చదివా. మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంక్ను సాధించా. చాలా ఆనందంగా ఉంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగా. ఎవరు కూడా నిరాశ పడొద్దు.- శ్రీజ, సివిల్స్ 20వ ర్యాంక్
పక్కా ప్రణాళికతో చదివితే సివిల్స్లో విజయం తథ్యం. ఎక్కడ కూడా గందరగోళానికి గురికావద్దు. వంద శాతం శ్రద్ధతో చదవాలి. విషయ పరిజ్ఞాణం పెంచుకోవాలి. మా నాన్న ఎల్ఐసీ ఏజెంట్. నిత్యం సొసైటీలో ఓ ప్రత్యేకతతో ఉండాలి.. పది మందికి సహాయపడాలి.. అనే మాటలతో నేను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నా. పరీక్షల సమయంలో కొవిడ్ కారణంగా మా అమ్మ దవాఖానలో ఉంది. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం, పట్టుదలతో ముందుకుసాగా. ప్రజలకు అందుబాటులో ఉంటా. మహిళా భద్రతకు ప్రాధాన్యతనిస్తా. – రాహుల్ రెడ్డి, 218 సివిల్స్ ర్యాంక్
అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే నా లక్ష్యం. పట్టణాభివృద్ధిపై అర్కిటెక్ట్ కావడంతో ఓ పక్కా ప్లాన్ ఉంది. ఏదైనా సాధిస్తామనే నమ్మకం మనలో ఉండాలి. కష్టమని మధ్యలోనే వదిలేయవద్దు. చిన్నప్పటి నుంచి నిజాయితితో పని చేసిన చాలా మంది అధికారులను చూశాను. వారిలా ప్రజలకు సేవలందించాలనే కోరిక పుట్టింది. ఆ కోరిక, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సీపీ మహేశ్ భగవత్ సార్ లాంటి వాళ్ల అనుభవంతో విజయం సాధించాను. – గౌతమి, 317 సివిల్స్ ర్యాంక్