ఉస్మానియా యూనివర్సిటీ, మే 11: మహాత్మా జ్యోతిబాఫూలే సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పలువురు వక్తలు అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పాటుపడడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘కాంటెంపరరీ రిలవెన్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిబాఫూలే’ అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సును గురువారం నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఐసీఎస్ఎస్ఆర్ – ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్రెడ్డి, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం హాజరయ్యారు. వక్తలుగా ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు.
ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసర్చ్ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు మాట్లాడుతూ బీసీలను వెనుకబడిన వర్గాలుగా పిలువకూడదని, వారిని అభివృద్ధి చెందిన కులాలుగా పిలవాలని సూచించారు. సమాజంలో ఆధునిక కాలానికి అనుగుణంగా విప్లవాత్మకమైన మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఇలాంటి సదస్సులలో మేధావుల ద్వారా పొందిన జ్ఞానాన్ని విద్యార్థులు సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు. బీసీల్లో తామంతా ఒకటే అనే భావన లేనందునే ప్రస్తుతం నాయకత్వ లోపం కనిపిస్తుందని చెప్పారు. డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫూలేకు మహాత్మా బిరుదును 1888 మే 11న ప్రదానం చేశారని గుర్తు చేశారు. ఆ రోజును పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్, మైనార్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సయీదా అజీమున్నీసా, ఓయూసీఐపీ డైరెక్టర్ డాక్టర్ కృష్ణకుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు, సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. స్టీవెన్సన్, పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్ డాక్టర్ చంద్రు, హిస్టరీ విభాగం హెడ్ డాక్టర్ అంజయ్య, డాక్టర్ ఇందిర, ప్రొఫెసర్ డైసీ, ప్రొఫెసర్ నరసింహులు, డాక్టర్ జె. సృజన, డాక్టర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.