రవీంద్రభారతి, డిసెంబర్ 31: దర్శనమ్ ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక 19వ వార్షికోత్సవం సందర్భంగా మహామహోపాధ్యాయ, భారతీ తీర్థపురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డా.దోర్బల ప్రభాకర శర్మకు దర్శనమ్ గురు సత్కార కార్యక్రమాన్ని రవీంద్రభారతిలోని మెయిన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.సత్యనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు (ఐఏఎస్), పి.విద్యాసాగర్రావు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మహామహోపాధ్యాయ, భారతీ తీర్థపురస్కార గ్రహీత బ్రహ్మాశ్రీ డా.దోర్బల ప్రభాకర శర్మకు దర్శనమ్ గురు సత్కారంతోపాటు స్వర్ణ కంకణం ప్రదానం, పుష్పాభిషేక ధార్మకవరేణ్య బిరుదు ప్రదానం, జీవన సాఫల్య సత్కారంతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురువులను సత్కరించుకోవడం మన దేశ సంస్కృతీ సంప్రదాయమన్నారు. పలువురు కళాకారులు, ఆధ్యాత్మికవేత్తల ఆధ్యాత్మిక వేదపఠనంతో పాటు దోర్బల ప్రభాకర శర్మను పల్లకీ సేవతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రచయిత ఆధ్యాత్మికవేత్త వనం జ్వాలా నరసింహారావు, వల్లూరి శ్రీరామచంద్రమూర్తి, మద్దులపల్లి గోపాలకృష్ణ, దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ, మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.