సిటీబ్యూరో: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావం ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులపై పడింది. ఈ పథకంతో రైళ్లలో ప్రయాణం చేయాల్సిన మహిళలందరూ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎంఎంటీఎస్లలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతంలో ఆక్యుపెన్సీ దాదాపు 50 శాతానికి పైగా నమోదవుతే.. ఫ్రీ బస్సుతో సగానికి పైగా ఓఆర్ తగ్గినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి రాకముందు ఎంఎంటీఎస్లో దాదాపు రోజుకు సగటున 47 వేల మంది ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు అందులో సగం మాత్రమే అంటే.. దాదాపు 28500 మందే ప్రయాణిస్తున్నారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికులు తగ్గిపోయారు. ఫలితంగా లింగంపల్లి-హైదరాబాద్, ఫలక్నుమా-లింగంపల్లి, సికింద్రాబాద్-ఉమ్దానగర్, సికింద్రాబాద్-మేడ్చల్ వంటి కొన్ని రైల్వే స్టేషన్ల మధ్య నడిచే లోకల్ సర్వీసులను ప్రయాణికులు లేక తరచూ రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.
ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో రద్దీ సమయాల్లో కూడా ఎంఎంటీఎస్ను ప్రయాణికులు లేక రద్దు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం, ఆదివారాలు, సెలవులు, పండగ రోజుల పేరుతో ప్రయాణికులు లేరంటూ డైలీ సర్వీసులు రద్దు చేస్తున్నారు. ప్రారంభంలో మొత్తం 120 సర్వీసులు అందుబాటులో ఉండేవి. కానీ రకరకాల కారణాలతో దశల వారీగా రైళ్లను రద్దు చేస్తున్నారు. 2020 కొవిడ్ వ్యాప్తి పేరుతో అన్ని లోకల్ రైళ్లను రద్దు చేశారు. కొవిడ్ అనంతరం కొన్ని సర్వీసులను మాత్రమే నడిపించారు. దశల వారీగా ఎంఎంటీఎస్లను పునరుద్ధరించినప్పటికీ వంద శాతం అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారుల చెబుతున్న లెక్కల ప్రకారం 80 సర్వీసులను నడిపిస్తున్నామంటున్నారు.